ఇక ఇరాన్ దేవుడిని తలుచుకోవాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ దేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యుద్ధ విరమణ ఒప్పందం కోసం తను ఇచ్చిన 10 రోజుల గడువు మరో 48 గంటల్లో ముగియబోతోందని, ఐనా ఇరాన్ దేశానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అందుకే 48 గంటల తర్వాత ఇరాన్ దేశంలో ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి బీభత్సం చూపించబోతున్నానని పేర్కొన్నారు. మంగళవారం ఇరాన్ దేశంలో మరణమృదంగం వినిపిస్తాననీ, ఆరోజు విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు, పరిశ్రమలు ఇలా ఇరాన్కు వెన్నెముక వంటివన్నీ విరిచేస్తామన్నారు.
అలా అన్నీ నాశనమయ్యే దాకా ఇరాన్ దారికి వచ్చేట్లు కనబడటం లేదన్నారు. ఇరాన్ దేశంపైన యుద్ధం చేసేందుకు 50 వేలమంది అమెరికన్ సాయుధ దళాలను పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అధునాతన యుద్ధ విమానాలు ఏ క్షణమైనా టేకాఫ్ అయ్యేందుకు రన్ వే పైన ఇంజిన్లు ఆన్లో పెట్టుకుని చూస్తున్నాయి. అటు సైన్యం, ఇటు విమానాలు అంతా కలిసి మంగళవారం నాడు ఇరాన్ దేశంలో బీభత్సం సృష్టించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన అధికారిక పేజీ ట్రూత్ లో ఆయన సహనం కోల్పోయి బూతులు సైతం రాశారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

