AP SSC Results
ఆంధ్రప్రదేశ్లో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షలు లేదా 10వ తరగతి తుది పరీక్షల ఫలితాలు గురువారం నాడు విడుదలయ్యాయి.బాలుర కంటే బాలికలే మెరుగైన ప్రతిభ కనబరిచారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 శాతంగా నమోదు కాగా, బాలురలో 82.68 శాతం మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ బోర్డు పరీక్షలకు ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్, సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. మన మిత్ర సేవ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఫలితాలను పొందడానికి అభ్యర్థులు 9552300009 నంబర్కు "Hi" అని సందేశం పంపవచ్చు. LEAP మొబైల్ అప్లికేషన్లో కూడా ఫలితాలను వీక్షించవచ్చు.
ఈ సందర్భంగా నారా లోకేష్ స్పందించారు. ఈ విజయం మన విద్యార్థుల పట్టుదలను, అలాగే ఉపాధ్యాయులు మరియు కుటుంబాల నుండి లభించిన బలమైన మద్దతును ప్రతిబింబిస్తుందని తెలిపారు. విజయం సాధించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
ఈసారి ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు - దయచేసి నిరాశ చెందవద్దునని.. కుటుంబాలు, ఉపాధ్యాయులు, సమాజం అందించే మద్దతుతో, వారు మరింత దృఢంగా తిరిగి రాగలరు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక, ప్రతి విద్యార్థి విజయం సాధించేలా చూడటానికి తాము కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.
కాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుండి జూన్ 4 వరకు నిర్వహించబడతాయని మాధ్యమిక విద్యా మండలి ప్రకటించింది. పరీక్ష రుసుములను మే 1 నుండి మే 9 వరకు చెల్లించవచ్చు. మార్కుల రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం, అభ్యర్థులు మే 1 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

