కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగర శివారు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య మరొకరితో లేచిపోయింది. దీన్ని అవమాన భారంగా భావించిన భర్త..
తన ఇద్దరు పిల్లలను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగుళూరు రూరల్ జిల్లా ఆల్కెరె గ్రామంలో జరిరగింది.
పోలీసుల కథనం మేరకు.. ఆ గ్రామానికి చెందిన శివణ్ణ (40), కావ్య (36) అనే దంపతులు ఉండగా, వీరికి జీవన్ (10), ప్రాణేశ్ (6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కావ్య వారం రోజుల క్రితం శివణ్ణ అక్క కుమారుడు హేమంత్తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాజీ కుదిర్చి కావ్యను ఇంటికి పంపించారు. దీంతో అంతా సర్దుకుంటుందని భావించారు. అయితే, కావ్య మూడు రోజుల క్రితం ఇంట్లోని నగదు, నగలు తీసుకుని మళ్లీ లేచిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శివణ్ణ శుక్రవారం రాత్రి తన ఇద్దరు పిల్లను హత్య చేసి, ఆపై తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

