వెంటలేటర్ పైన వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణవాయువు ఇచ్చారు మన ప్రధానమంత్రి. కొంతమంది భోగాపురంకి ఎర్రబస్సు రాదన్నారు, ఇవాళ ఎయిర్ పోర్ట్ వచ్చింది. ఎన్నో సమస్యలు సృష్టించారు. అన్నీ అధిగమించాము. ఈ విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నా. అల్లూరు సీతారామరాజు పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది.
ఈ విమానాశ్రయం నిర్మించింది ఉత్తరాంధ్రకు చెందిన GMR గ్రంథి మల్లికార్జునరావు. 2027 చివరి నాటికి పోలవరం పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాము. 2028లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాము.
భోగాపురం ఎయిర్పోర్ట్ విశిష్టత ఏమిటి?
దాదాపు రూ. 5000 కోట్లతో నిర్మించిన అల్లూరు సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ విమానాశ్రయం ప్రాముఖ్యత ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాము. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) ప్రాంత రూపురేఖలను మార్చే అత్యంత ఆధునిక ప్రాజెక్ట్. ప్రధాన ప్రత్యేకతలు ఏమిటంటే... కేవలం 31 నెలల రికార్డు సమయంలో పూర్తయిన అతికొద్ది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలలో ఇది ఒకటి.
మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమై, రాబోయే దశల్లో 4 కోట్ల ప్రయాణికుల వరకు తట్టుకునేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. బంగాళాఖాతం సముద్ర తీరం, "ఎగిరే చేప", తెలుగు సాంప్రదాయ "ముగ్గులు" కాన్సెప్ట్లతో దీని టెర్మినల్ను అత్యంత సుందరంగా డిజైన్ చేశారు. 3,800 మీటర్ల కోడ్-E రన్ వేతో బోయింగ్ 777, డ్రీమ్లైనర్ (B787), ఎయిర్బస్ A330 వంటి భారీ వైడ్-బాడీ అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అవ్వడానికి అనుకూలమైన రన్ వే సౌకర్యం ఉంది.
మల్టీ-మోడల్ కనెక్టివిటీ- సీఫుడ్-ఫార్మా ఎగుమతులు... విశాఖ పోర్ట్, జాతీయ రహదారులకు సమీపంలో ఉండటంతో ఉత్తరాంధ్ర నుండి సీఫుడ్, ఫార్మా రసాయనాల వేగవంతమైన ఎగుమతులకు ప్రత్యేక కార్గో టెర్మినల్ నిలుస్తుంది. ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే 500 ఎకరాలలో ఏవియేషన్ హబ్, ఏవియేషన్ యూనివర్సిటీ/ఎడ్యుసిటీ ప్రతిపాదించబడ్డాయి.

