ముఖ్యంగా గజినీ చిత్రంతో దేశ వ్యాప్తంగా విలన్ పాత్రలో మెప్పించి, గుర్తింపు పొందిన ప్రదీవ్ రావత్ వయసు 74 యేళ్లు. గత కొన్నినెలలుగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. తెలుగులో 'సై', 'ఛత్రపతి' వంటి చిత్రాల్లో పవర్ఫుల్ విలన్గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన మరణవార్తతో సినీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆయనకు భార్య కల్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రదీప్ రావత్ మొదట కోకిలాబెన్ ఆసుపత్రిలో, ఆ తర్వాత మరో ఆసుపత్రిలో చికిత్స పొందారని ఆమె తెలిపారు. ఆయన సహనటుడు, 'లగాన్' ఫేమ్ యశీల్ శర్మ కూడా ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ, "మా గజినీ, లగాన్ దేవా ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని భావోద్వేగ పోస్ట్ చేశారు.
బీఆర్ చోప్రా రూపొందించిన 'మహాభారత్' సీరియల్లో అశ్వత్థామ పాత్రతో ప్రదీప్ రావత్ తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'సర్ఫరోష్', 'లగాన్' వంటి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అయితే, 2008లో వచ్చిన 'గజినీ' చిత్రంలో పోషించిన ప్రతినాయకుడి పాత్ర ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచి, దేశవ్యాప్తంగా విపరీతమైన కీర్తిని తెచ్చిపెట్టింది.
తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రదీప్ రావత్ తనదైన ముద్ర వేశారు. 'సై', 'ఛత్రపతి', 'భద్ర', 'లక్ష్మీ', 'దేశముదురు', 'స్టాలిన్' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన గంభీరమైన రూపం, డైలాగ్ డెలివరీ విలన్ పాత్రలకు ప్రాణం పోశాయి. హిందీ, తెలుగుతో పాటు తమిళ, నేపాలీ భాషల్లోనూ ఆయన నటించారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

