National High Way
ఏపీకి మరో నేషనల్ హైవే రానుంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు నిర్మించిన ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ జాతీయ రహదారి (ఎన్హెచ్-716బీ)లో వాహనాల రాకపోకలను అధికారులు అనుమతించారు. మొత్తం 116.5 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిలో ప్రస్తుతం 92 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో రవాణా సౌలభ్యం కోసం ఈ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.
గ్రీన్ఫీల్డ్ హైవే కావడంతో ఇది జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల గుండా వెళ్తుంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు వేగంగా ప్రయాణించే అవకాశం ఉంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఇంధన పొదుపుకు కూడా ఇది దోహదపడుతుంది.
ఈ హైవే ఏపీలో సుమారు 75 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ హైవే అందుబాటులోకి రావడం వల్ల చిత్తూరు నుంచి చెన్నైలోని కీలకమైన కామరాజార్ (ఎన్నూర్) పోర్ట్, కట్టుపల్లి పోర్టులకు అనుసంధానం సులభతరమైంది. పారిశ్రామిక ఉత్పత్తులు, ఇతర సరుకు రవాణాకు ఈ ఆరు లైన్ల రహదారి ఎంతో కీలకం కానుంది.

