Squirrel
రాజస్థాన్లోని మోహన్లాల్ సుఖాడియా యూనివర్సిటీలో గత నెల రోజులుగా ఉడుత భీభత్సం సృష్టిస్తోంది. విద్యార్థులు, సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. సుఖాడియా వర్శిటీ ఉడుత దాడిలో సుమారు 18 మంది గాయపడ్డారు. కిటికీల దగ్గర లేదా కర్టెన్ల వెనుక మాటువేసి, ఎవరూ చూడని సమయంలో ఒక్కసారిగా మీదకు దూకి కరుస్తోంది.
ఉదయ్పూర్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువుల్లో మానసిక ఒత్తిడి పెరిగి, అవి దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉందని, ఇంకా వాటికి సరిగ్గా ఆహారం లభించకపోవడంతో చిరాకుతో ఇలా చేస్తున్నాయని వన్య ప్రాణుల సంరక్షణాధికారులు చెప్తున్నారు.
యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్, ముఖ్యంగా సైకాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాల వద్ద ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఉడుతను పట్టుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నం విఫలమైందని వర్శిటీ అధికారులు తెలిపారు. యానిమల్ ఎయిడ్' బృందం దాన్ని పట్టుకోలేకపోవడంతో, ఇప్పుడు ప్రత్యేకంగా వన్యప్రాణి నిపుణుల సహాయం కోరారు. త్వరలోనే దీన్ని పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

