vijay cm
తమిళనాట పొలిటికల్ థ్రిల్లర్ జరుగుతోంది. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల కుట్ర చేసినట్లుగా డీఎంకే నేతలపై ఆరోపణలు వస్తున్నాయి.ఒక అసెంబ్లీ తీర్మానం సందర్భంగా పక్షం మారేందుకు తనకు రూ.35 కోట్లు ఆఫర్ చేశారని టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా పేర్కొన్నారు. డీఎంకేతో సంబంధం ఉన్న నాయకులు పలువురు టీవీకే ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని రూ.50 కోట్ల వరకు ఆఫర్లు ఇస్తున్నారని మంత్రి సి.టి. నిర్మల్ కుమార్ ఆరోపించారు.
కానీ అందుకు ఎలాంటి బహిరంగ ఆధారాలు అందించలేదు. జోసెఫ్ సి. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, బేరసారాల ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయడంతో బుధవారం మరో వివాదం చెలరేగింది. మరోవైపు, పార్టీ ఫిరాయింపుల కోసం పలువురు ఎమ్మెల్యేలకు రూ. 35 కోట్లు ఆఫర్ చేశారని తమిళగ వెట్రి కజగం (టీవీకే) సీనియర్ నాయకులు ఆరోపించారు.
ఈ రాజకీయ దుమారం మధ్య, ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలో తన కూటమి భాగస్వాములతో సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఎం. కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
కాగా సీఎం విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ రాజకీయ కుట్రను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, చెన్నై పోలీసులు భగ్నం చేశారు. కేవలం ఏడు వారాల్లోనే విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపాదించ తలపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రతిపక్ష డీఎంకే కీలక నేతలు తెరవెనుక హార్స్ ట్రేడింగ్ తెరలేపారనే మైండ్ గేమ్ను పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో చెన్నై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

