అత్యాధునిక కెమరాలు, లైటింగ్, స్పీకర్లతో జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్లు క్షేత్రస్థాయి పరిస్థితులను క్షణాల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరవేయగలవు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఇచ్చిన సూచనల మేరకు పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ అంశంపై దృష్టిపెట్టిన పోలీసు అధికారులు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో
డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ ప్రారంభించినట్టు సమాచారం. త్వరలోనే ఎక్కడ ఏ నేరం, ప్రమాదం జరిగినా ఆకాశంలో వెంటనే పోలీస్ సైరన్ మోగనున్నది.
డ్రోన్లు ప్రత్యేకం..
ప్రతి డ్రోన్కు పోలీస్ సైరన్, ప్రత్యేక లైట్లు, అత్యాధునిక కెమెరాలను అమరుస్తారు. లొకేషన్ సమాచారం అందగానే జీపీఎస్ సాయంతో అక్కడికి నిమిషాల్లో చేరిపోయి ఆటోమెటిక్గా పనిచేస్తాయి. ఒక్కో డ్రోన్ మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది.
పగలు, రాత్రివేళల్లో కెమెరాల సామర్థ్యం, క్రైం స్పాట్కు చేరడంలో డ్రోన్లకు ఎదురవుతున్న అవరోధాలు, స్పాట్లోని వ్యక్తులకు పోలీసులు ఇచ్చే సూచనలు వినిపించేలా స్పీకర్ల సామర్థ్యాన్ని పెంచడం తదితర అంశాలను పరీక్షిస్తున్నట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఎవరైనా డ్రోన్లను రాళ్లతో కొట్టి పాడు చేయకుండా వాటిని ఎంత ఎత్తులో ఆపరేట్ చేయాలన్న అంశాలను కూడా అధ్యయనం చేస్తున్నారు.
డ్రోన్లతో ఏంటి ఉపయోగం?
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం, నేరం జరిగినట్టు డయల్ 100, హాక్ఐ లేదా మరే రూపంలోనైనా పోలీసులకు సమాచారం చేరితే వెంటనే ఆ ప్రదేశాన్ని లొకేషన్ బేస్డ్ సర్వీస్ ద్వారా గుర్తించి డ్రోన్లకు పంపుతారు. పోలీసులు వాహనాల్లో
చేరుకోవడానికి కొన్నిసార్లు సమయం పట్టవచ్చు.
కానీ, గాల్లో వెళ్లే డ్రోన్లు ఎలాంటి అవరోధాలు లేకుండా చేరతాయి. ఘటనా స్థలంలో పరిస్థితిని వీడియోలు, ఫొటోల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్కు క్షణాల్లో చేరవేస్తాయి. దాంతో పరిస్థితిని అంచనావేసి అవసరం మేరకు సిబ్బందిని అప్రమత్తం చేసే వీలు కలుగుతుంది.
అదేవిధంగా డ్రోన్లకు ఉండే పోలీస్ సైరన్తో నేరస్తుడికి పోలీసులు వస్తున్నారన్న భయం కలుగుతుంది. బాధితులకు ధైర్యం వస్తుంది. స్పీకర్ల ద్వారా పోలీసులు నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పవచ్చు. క్రైం సీన్ను బట్టి అంబులెన్స్, ఫైర్ తదితర విభాగాలను అలర్ట్ చేసే వీలుంటుంది.

