ఇటీవల రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తూ పోలవరం జిల్లాలో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్దపులి.. మళ్లీ గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.
శుక్రవారం ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది. గతంలో పులిని బంధించినపుడు పులి మెడకు రేడియో కాలర్ పరికరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పులి ఎక్కడుందనే ఖచ్చిత వివరాలను తెలుసుకుంటున్నారు.
పోలవరం జిల్లాలోని వేములోవ, పిడతమామిడి, రాములుదేవపురం, వడ్డిచెరువు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు పర్యటించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. నాలుగు నెలల్లో 20 పశువులపై పెద్దపులి దాడి చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని డీఎఫ్వో సూచించారు.
పశువులను బయటకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు. పులి దాడిలో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయని... వీలైనంత త్వరలో పట్టుకుంటామని అధికారులు తెలిపారు. దట్టమైన అడవి కావడం వల్ల పులిని బంధించడం కొంత ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.

