జాతీయ రహదారిపై గత నెల 26న కుజ్జిపేట చెరువుగట్టు వద్ద స్థానికులు మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా స్నేహితుడే ప్రాణం తీసినట్లు తేలింది. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆదివారం కోటబొమ్మాళిలో వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రంలోని దిగపొహండి పోలీస్స్టేషన్ పరిధిలో కోటినాడ గ్రామానికి చెందిన బాపూజీ స్వయిన్ (41) అదే రాష్ట్రం బిపులింగి గ్రామానికి చెందిన హరికృష్ణ చౌదరి వద్ద 9 నెలల నుంచి లారీడ్రైవర్గా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న బిపులింగి గ్రామస్థుడు కేదారిదాస్ తరచూ వాహనాల్లో డీజిల్ అమ్మేస్తున్నట్లు బాపూజీ ద్వారా తెలుసుకున్న యజమాని సదరు వ్యక్తిని పనిలో నుంచి తీసేశారు. దీంతో బాపూజీపై కేదారిదాస్ కక్ష పెంచుకున్నాడు. బాపూజీ గత నెల 25వ తేదీన ఒడిశా నుంచి బొబ్బిలికి అట్టల లోడుతో వెళ్తూ తోడుగా నిందితుడిని రమ్మని కేదారిదాస్ను పిలిచాడు.
మార్గమధ్యంలో బ్రహ్మపుర వద్ద ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వాహనాన్ని కేదారిదాస్ నడుపుతూ ఎచ్చెర్ల వరకు వెళ్లాడు. తిరిగి వాహనాన్ని కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం అండర్పాస్ వరకు తెచ్చి నిద్రమత్తులో ఉన్న బాపూజీని ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు.
మృతదేహాన్ని సమీపంలో ఉన్న చెరువు వద్ద పడేసి వెళ్లిపోయాడు. వాహనంలోని అట్టలను రూ.45,600లకు విక్రయించి వాహనాన్ని గొలంత్రా గ్రామం వద్ద ఉంచేసి పరారయ్యాడు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని ఆదివారం నందిగాం మండలం కొత్తఅగ్రహారం సమీపంలో ఓ తుక్కు దుకాణం వద్ద గుర్తించి అదుపులో తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

