Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేస్తున్నారా?.. టీజీసీఎస్‌బీ కీలక సూచన

ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేస్తున్నారా?.. టీజీసీఎస్‌బీ కీలక సూచన

హైదరాబాద్, మే 21: ఐపీఎల్ నకిలీ టికెట్ల మోసాలపై క్రికెట్ అభిమానులను టీజీసీఎస్‌బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా, నకిలీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్లను కేటుగాళ్లు విక్రయిస్తారని హెచ్చరించింది.

అలాగే వీఐపీ, వీవీఐపీ పాస్‌ల పేరిట భారీ డిస్కౌంట్లు ఇస్తామంటూ సైబర్ మోసగాళ్లు వల వేస్తారని స్పష్టం చేసింది. అదే విధంగా చివరి నిమిషం అంటూ టికెట్ల ఆఫర్ల (Last-minute offers) పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని క్రికెట్ అభిమానులకు టీజీసీఎస్‌బీ స్పష్టం చేసింది.

ఐపీఎల్ టికెట్ బుకింగ్‌లకు 'డిస్ట్రిక్ట్ యాప్' మాత్రమే అధికారిక భాగస్వామి అని ఈ సందర్భంగా టీజీసీఎస్‌బీ వెల్లడించింది. వ్యక్తిగత యూపీఐ ఐడీలకు నగదు పంపమని కోరితే అది మోసంగా పరిగణించాలని క్రికెట్ అభిమానులకు సూచించింది. తక్కువ ఫాలోవర్లు ఉన్న కొత్త సోషల్ మీడియా పేజీల ద్వారా జరిగే టికెట్ విక్రయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మొత్తం నగదు ముందే చెల్లించమని కోరే వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దని క్రికెట్ అభిమానులను టీజీసీఎస్‌బీ హెచ్చరించింది.

ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు చెల్లింపులు చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను తప్పని సరిగా పరిశీలించాలని క్రికెట్ అభిమానులకు టీజీసీఎస్‌బీ స్పష్టం చేసింది. అలాగే ఓటీపీలు, బ్యాంకింగ్ రహస్య వివరాలు.. ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపింది. ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసాల బారిన పడితే వెంటనే '1930' హెల్ప్‌ లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయలని క్రికెట్ అభిమానులకు టీజీసీఎస్‌బీ స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy