హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు (AntiCorruption Bureau) కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, సీవరేజీ బోర్డుకు చెందిన రెడ్హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది.
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు హైదరాబాద్తో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో ఈరోజు(మంగళవారం) ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు.
18 ఎకరాల వ్యవసాయ భూములు..
ఈ సోదాల్లో భాగంగా నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సుమారు 18 ఎకరాల వ్యవసాయ భూములు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అదనంగా 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు, హైదరాబాద్లో ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ అధికారిక అంచనాల కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సోదాల్లో రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు కూడా గుర్తించారు. ఒక మారుతి రిట్జ్ కారు, ఒక బజాజ్ బైక్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం ఆస్తుల విలువ రూ.5.88 కోట్లు...
ప్రాథమికంగా మొత్తం ఆస్తుల విలువ రూ.5.88 కోట్లుగా అంచనా వేస్తున్నప్పటికీ, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించినట్లు ఆధారాలు లభించాయని, ఇంకా పలు పత్రాలు, లావాదేవీలపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇదే కేసులో అనంత లక్ష్మీకుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మల్లాపూర్లోని ఆయన నివాసంలో గంటల పాటు కొనసాగిన సోదాల అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. రేపు ఉదయం అనంత లక్ష్మీకుమార్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. ఈ కేసుతో తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో మరోసారి అవినీతి అంశం చర్చనీయాంశంగా మారింది.
.
తెలంగాణ ఈ-గవర్నెన్స్పై ప్రశంసలు.. ప్రజలకు సులభ సేవలపై కేంద్రం దృష్టి
భద్రతా దళాల సమన్వయంతో నక్సలిజంపై విజయం సాధించాం: అమిత్ షా
రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా
Read Latest Telangana News And AP News And International News And Telugu News

