ఇంటర్నెట్ డెస్క్: మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం (పంజాబ్) వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తొలి రోజున టీమిండియా పరుగుల వరద పారించింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు రాబట్టింది. శుభ్మన్ గిల్ (103*), కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ (81) పరుగుల పారించడంతో ఆట ముగిసే సమయానికి భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. క్రీజ్లో శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ (50*) ఉన్నారు.
టాస్ గెలవడంతో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా యశశ్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. జైస్వాల్ ఐదు బౌండరీలతో తొలి నుంచీ దూకుడుగా ఆడాడు. రాహుల్ మాత్రం ఆచితూచి పరుగులు రాబట్టాడు. అయితే, ముహమ్మద్ సలీమ్ బౌలింగ్లో 11వ ఓవర్లో జైశ్వాల్ (24) ఔటవడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం బరిలోకి దిగిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇద్దరూ స్ట్రైక్ను రొటేట్ చేస్తూ క్రమం తప్పకుండా పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, సెంచరీకి కొద్ది దూరంలో ఉండగా సాయి సుదర్శన్ (81) వికెట్ చేజార్చుకున్నాడు. సలీమ్ బౌలింగ్లో కీపర్కు చిక్కి వెనుదిరిగాడు.
ఆ తరువాత క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ భారత్ ఇన్నింగ్స్కు స్థిరత్వాన్ని ఇచ్చాడు. అధ్బుతమైన షాట్స్తో ఆకట్టుకున్నాడు. అయితే, కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్న మరుక్షణమే ఔటయ్యాడు. జియౌర్ రెహ్మాన్ షరీఫీ బౌలింగ్లో రాహుల్ ఎక్స్ట్రా కవర్ వద్ద దొరికిపోయాడు. అనంతరం రిషభ్ పంత్, గిల్ కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో గిల్ తన కెరీర్లో 11వ శతకం పూర్తి చేసుకున్నాడు. పంత్ అర్థశతకాన్ని పూర్తి చేశాడు.

