Dailyhunt
బీజేపీ వస్తే బుల్డోజర్లతో అందర్నీ గెంటేస్తుంది.. మమతా బెనర్జీ

బీజేపీ వస్తే బుల్డోజర్లతో అందర్నీ గెంటేస్తుంది.. మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బెంగాల్‌ను నాశనం చేసే ప్రయత్నంలో ఆ పార్టీ దేశంలోనే అధికారంలో లేకుండా పోతుందని అన్నారు.

ఢిల్లీని పట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను తాను ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు. రాణిగంజ్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతాబెనర్జీ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లను ఉపయోగించి ప్రతి ఒక్కరిని రాష్ట్రం నుంచి గెంటేస్తుందని అన్నారు.

ఎస్ఐఆర్‌తో బీజేపీకి మరణశాసనం

ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లను తొలగించేందుకు కాషాయం పార్టీతో ఎన్నికల కమిషన్ చేతులు కలిపిందని మమతా బెనర్జీ ఆరోపించారు. 'లక్ష్మణరేఖ అనేది ఉండాలి, కానీ బీజేపీ అన్ని హద్దులూ అతిక్రమించింది. ఎస్ఐఆర్‌ మీ పతనానికి మరణశాసనం అవుతుంది' అని బీజేపీని హెచ్చరించారు.

ముర్షీదాబాద్‌లో శ్రీరామనవమి ఊరేగింపులో ఘర్షణలు చోటుచేసుకోవడంపై మాట్లాడుతూ, తాను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రినని, అయితే తన అధికారాలన్నీ వాళ్లు ఊడలాక్కున్నారని బీజేపీని విమర్శించారు. టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగానే హింసాకాండకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా ముర్షీదాబాద్ జిల్లాలో శుక్రవారంనాడు రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో రాళ్లు రువ్వకోవడం, విధ్వంసం, లూటీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. జాంగీపూర్, రఘనాథ్ గంజ్ ఏరియాలో ఈ ప్రభావం తీవ్రంగా ఉండటంతో పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy