Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం  ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్.. ఈరోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై, అభినందనలు తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అజారుద్దీన్ మాట్లాడారు.

మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తా: మంత్రి అజారుద్దీన్

తాను కెప్టెన్ కాదని.. తమ కెప్టెన్ రేవంత్‌రెడ్డి అని మంత్రి అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో క్లీన్‌బౌల్డ్ ఉండదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో చూస్తూ, ఆడుకుంటూ వెళ్లాలని అన్నారు. తనకు పొలిటికల్ ఫ్యాన్స్ కంటే.. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ అని తెలిపారు. పొలిటికల్ ఫ్యాన్స్‌ను కూడా తాను పెంచుకుంటానని తెలిపారు. తనకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు తన కోసం చాలా చేశారని ప్రస్తావించారు. ప్రజల కోసం ఇంకా కష్టపడి పని చేస్తానని స్పష్టం చేశారు. మైనార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మైనార్టీల కోసం చాలా సహాయం చేశారని తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు ఏమైనా మాట్లాడటం సహజమని పేర్కొన్నారు.

నాకు మంత్రి పదవిపై ఆశ లేదు: కోదండరాం

తనకు మంత్రి పదవిపై ఆశ లేదని ఎమ్మెల్సీ కోదండరాం వ్యాఖ్యానించారు. పదవులు అనేవి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఒకాయన తాను పోరాడాతానా లేదా అని అన్నారని.. తాను పోరాడి చూపిస్తానని చెప్పుకొచ్చారు. గతంలో తనపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన తన పని ఆగలేదని.. కొనసాగుతోందని స్పష్టం చేశారు. వివాదాస్పద సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. లక్ష్యాలను ఎంచుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు. ఇప్పటివరకు చేస్తున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి తనకు ఎమ్మెల్సీ ఉపయోగపడుతుందని వెల్లడించారు. జయశంకర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతానని తెలిపారు. గతంలో ఏ రకంగా తన జీవన శైలి ఉందో.. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నిలబడతానని.. వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటానని కోదండరాం పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy