హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్(Additional MD)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీఓ ఆర్టీ నం.920ని విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా కూడా అజిత్ రెడ్డి విధులు నిర్వర్తించనున్నారు.
అజిత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ అనంతరం తాజాగా ఆయనకు హైదరాబాద్ మెట్రో రైల్లో కీలక అదనపు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ప్రస్తుతం హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా సర్పరాజ్ అహ్మద్ కొనసాతున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్వహణ, విస్తరణ పనులు వేగవంతం చేయడంతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నియామకం దోహదపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది.

