హైదరాబాద్, ఏప్రిల్ 2: సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్లో జరిగింది. మృతుడు అనకాపల్లికి చెందిన వడపల్లి సంజయ్ (55)గా గుర్తించారు.
సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చిన సంజయ్.. విద్యానగర్లో బంధువుల ఇంట్లో ఉంటూ ఆడిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీలో ఉన్న ఓ సినిమా కార్యాలయానికి సంజయ్ వెళ్లాడు. అక్కడ ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పడంతో అతడు నిరాశ చెందాడు.
మరోసారి అవకాశం ఇవ్వాలని కార్యాలయానికి వెళ్లి వేడుకున్నాడు సంజయ్. అవకాశం లేదని నిర్వాహకులు స్పష్టం చేయడంతో అతడు కిందకు దిగి వస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్న అతడు కొద్దిసేపటికే కుప్పకూలాడు. వెంటనే సంజయ్ను ఆస్పత్రికి తరలించారు సినీ నిర్వాహకులు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్ల సంజయ్ ప్రాణాలు కోల్పోయినట్లు సినిమా కార్యాలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
.
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News

