అమరావతి: హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నేత అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మహిళా సంఘాలు, తెలుగు మహిళ నేతలు, అధికార కూటమి నాయకులు అమర్నాథ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల కట్టు, బొట్టు, వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మండిపడుతున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఒక హోంమంత్రిని మాత్రమే కాకుండా యావత్ మహిళా జాతిని అవమానించినట్టేనని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ కూడా అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించారు. ఒక దళిత మహిళను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం వైసీపీ విషపూరిత రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇదే అంశంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ.. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. రాజకీయ ముసుగులో మహిళలను కించపరిచేలా మాట్లాడే వారి గురించి తాను కచ్చితంగా మాట్లాడతానని హెచ్చరించారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే వారు తమ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలను అవమానించేలా మాట్లాడుతున్న వైసీపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళ నాయకులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
'మీ ఇంటి వద్దే ఉన్నా.. డీఎస్సీపై చర్చకు సిద్ధం'.. జగన్కు లోకేశ్ సవాల్

