Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యంగ్ ప్లేయర్, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది.

ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన ఇషాన్‌ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్న ఓ సాధారణ ప్లేయర్ అయిన రాబిన్‌ మింజ్‌ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మే 30న జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం ఘనంగా జరిగింది.

రాంచీ వేదికగా జరిగిన జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో రాంచీ టైటాన్స్‌, జంషెడ్‌పూర్‌ స్టీలర్స్‌, చోటా నాగ్‌పూర్‌ రాయల్స్‌, కోయలాంఛల్‌ సూపర్‌కింగ్స్‌, థన్‌బాద్‌ డైమాండ్స్‌, సంథల్‌ స్ట్రయికర్స్‌ అనే ఆరు ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు తలో రూ.50 లక్షల బడ్జెట్‌తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ అక్షన్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రాబిన్ మింజ్‌ను దక్కించుకునేందుకు అన్ని జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.

మరోవైపు టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్‌ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్‌తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశీయ క్రికెట్‌లో రాబిన్‌కు పవర్ హిట్టర్ అనే పేరు ఉంది. ఆ ఇమేజ్ అతడిని ఇషాన్‌ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. అలానే ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ఈ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కాగా, జార్ఖండ్‌ టీ20 లీగ్‌ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 27 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy