Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకలో కలకలం.. విలేకరుల ముందే మంత్రి రాజీనామా

కర్ణాటకలో కలకలం.. విలేకరుల ముందే మంత్రి రాజీనామా

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పతాకస్థాయికి చేరాయి. డీకే కేబినెట్‌లో తనకు ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగా రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి గుడ్‌బై చెప్పేశారు. విలేకరుల ముందే రాజీనామా లేఖపై సంతకం చేశారు.

'ఆ శాఖ నాకే ఇస్తానని రెండు సార్లు వాళ్లు చెప్పారు. కానీ అది జరగలేదు. ఇది నిరాశ కలిగించింది. అందుకే రాజీనామా చేస్తున్నా' అని అన్నారు. 'డీకే మా ఇంటికి వచ్చి మరీ చెప్పారు. తాను సీఎం కాగానే తన వద్ద ఉన్న బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖను నాకు కేటాయిస్తానని అన్నారు' అని రామలింగా రెడ్డి చెప్పారు. ప్రమాణస్వీకారానికి ముందు రోజు కూడా మరోసారి ఇదే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, తనకు డీకేపై గానీ మాజీ సీఎం సిద్ధరామయ్యపై గానీ ఎలాంటి అసంతృప్తి లేదని కూడా చెప్పారు.

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖ మినహా మరేదీ స్వీకరించేది లేదని రామలింగా రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే, ఆయనకు నీటి పారుదల ప్రాజెక్టుల శాఖ దక్కడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖను సీఎం డీకే శివకుమార్ మరో సీనియర్ నేత కృష్ణ బైరె గౌడకు కేటాయించారు.

బీటీఎమ్ లేఅవుట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగా రెడ్డి సిద్ధరామయ్య ప్రభుత్వంలో రవాణా, ఎండోమెంట్ శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో ఆయన హోం మంత్రిగా కూడా ఉన్నారు. ఇక సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న కృష్ణ గౌడకు ఈసారి బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖ దక్కింది. కృష్ణ గౌడ తండ్రి సీ బైరె గౌడ గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy