Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.

దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ ప్రాజెక్టులతో సమాన ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు - రంగారెడ్డి పనులు 90శాతం పూర్తి అయ్యాయన్నది అసత్యమని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారని విమర్శించారు.

ఈరోజు (మంగళవారం) సచివాలయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. పాలమూరుకు కేసీఆర్ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని చెప్పుకొచ్చారు. జూరాల ప్రాజెక్టులో పూడిక తొలగించి నిల్వ సామర్థ్యం పెంచుతున్నట్లు తెలిపారు. DRIP కింద జూరాల అభివృద్ధికి ప్రతిపాదనలు చేశామని వివరించారు.

వర్షాకాలానికి ముందే చెరువుల్లో పూడికతీత పనులు చేపడతామని స్పష్టం చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 1226 గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. 15 రోజుల్లో మరోసారి ప్రగతి సమీక్ష నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy