స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి టాటూలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో విభిన్నమైన డిజైన్లను కోహ్లీ టాటూగా వేయించుకున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన కొత్త టాటూతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అతడి ఎడమ చేతిపై కనిపిస్తున్న ఈ కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న కోహ్లీ వేయించుకున్న టాటూను పరిశీలిస్తే.. చాలా వెరైటీగా కనిపిస్తోంది. ఈ తాజా డిజైన్, సముద్రంలో లేదా చెరువులో ఒక నీటి చుక్క పడినప్పుడు ఉపరితలంపై అలలు ఏర్పడినట్లు కనిపిస్తోంది. కోహ్లీ తన కొత్త టాటూ కోసం ఇప్పటివరకు ఐదు సెషన్లు చేయించుకున్నాడు. కానీ పని ఇంకా కొనసాగుతోందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ టాటూ ప్రాజెక్ట్ను కోహ్లీ జీవిత ప్రయాణం, వ్యక్తిగత పరిణామం, గత అనుభవాలు, ప్రస్తుత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు ఏలియన్స్ టాటూ వివరించినట్లు నివేదికలు వెల్లడించాయి.
తాజాగా టాటూ పూరైతే.. ఇది 12వది అవుతుంది. ఇప్పటికే ఆయన చేతిపై శివుడి ప్రేరణతో కూడిన డిజైన్, మండల, లోటస్, పియోనీ వంటి పలు టాటాలు ఉన్నాయి. ఇందులో మండల డిజైన్ను బ్యాలెన్స్, డిసిప్లిన్, అంతర్గత సమతుల్యతకు ప్రతీకగా టాటూ స్టూడియో పేర్కొంది. అయితే ఈ అంశాలకు కోహ్లీ వ్యక్తిగతంగా ఎలాంటి అర్థం ఇచ్చారన్నది మాత్రం స్పష్టంగా తెలియదు.

