అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2024 ఓటమి నిరాశ, నిస్పృహలతో, ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సాక్షాత్తు కలియుగ దేవుడు వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకుంటే.. ఆ దేవుడే వారిని మొన్నటి ఎన్నికల్లో శిక్షించారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్, కడప పాస్టర్ అభినయ్లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ అండ్ కో చూస్తే బెడిసి కొట్టిందని ఎద్దేవా చేశారు. వైసీపీ కాపు నేతలను రెచ్చగొట్టి, తప్పులు చేయించి, జైలుకు పంపి రేపు బయటకు పోలేక, జీవితాంతం జగన్ చుట్టూ ఉండేలా, ఆయన అజెండా మాత్రమే అమలు చేసేలా పులివెందుల సంస్కృతిని ఏపీలో తీసుకువస్తున్నారని ఆగ్రహించారు.
బలమైన నేతలను తయారు చేసే కర్మాగారం టీడీపీ..
శ్రీలక్ష్మి, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారితో జగన్ తప్పులు చేయించారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. కొందరిని జైలుకు పంపారని, తద్వారా జగన్ ఉచ్చు లోంచి అంత త్వరగా బయటకు రాలేకపోయారని చెప్పుకొచ్చారు. నేరస్థులను తయారు చేసే కర్మాగారం గొడ్డలి పార్టీది అని వ్యంగ్యంగా అన్నారు. బలమైన నేతలను తయారు చేసే కర్మాగారం టీడీపీది అని అభివర్ణించారు. పలువురు నేతలను పెద్దల సభకు పంపింది తెలుగుదేశం పార్టీ అని ప్రస్తావించారు. చదలవాడ, ఆదికేశవులు, పప్పల చలపతిరావు వంటి వారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి టీడీపీ గౌరవించిందని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిలకు అవకాశాలు ఇచ్చారని దుయ్యబట్టారు. బ్రిటీష్ కాలంలో ఉన్న కాపుల రిజర్వేషన్ను నీలం సంజీవరెడ్డి తొలగించారని తెలిపారు.
కాపు రిజర్వేషన్లను జగన్ రెడ్డి రద్దు చేశారు..
దామోదరం సంజీవయ్య ఇచ్చిన కాపుల రిజర్వేషన్లని.. కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించారని మంత్రి నిమ్మల ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన EWS ఐదు శాతం కాపు రిజర్వేషన్లను జగన్ రెడ్డి రద్దు చేశారని ఆగ్రహించారు. కాపు చరిత్రలో రిజర్వేషన్లు ఇచ్చింది దామోదరం సంజీవయ్య, చంద్రబాబు మాత్రమేనని తెలిపారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జగన్ రెడ్డి కాపు రిజర్వేషన్లను రద్దు చేసి కాపు ద్రోహులుగా మిగిలిపోయారని విమర్శించారు. రామలక్ష్మాణులా మాదిరిగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉన్నంత కాలం ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు. వైసీపీకి అధికారం రాదనే అక్కసుతో పవన్ కల్యాణ్, కాపులను జగన్ టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులాల మధ్య అడ్డుగోడలు ఉండకూడదనే లక్ష్యంతో చంద్రబాబు పని చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
.
ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం
నెల్లూరు ఏఎస్పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వక్ఫ్కు లేఖ
Read Latest AP News AndTelangana News And National News
And Telugu News

