నిర్మల్ జిల్లా, జూన్ 07: జిల్లాలోని తానూరు మండల పరిధిలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని మొగిలి గ్రామ శివారులో ఓ చిరుతపులి..
పశువుల మందపై దాడికి తెగబడింది. ఈ దాడిలో ఓ ఆవు దూడ మృతి చెందింది. గ్రామ శివారులోని పొలాల సమీపంలో పశువులు మేత మేస్తుండగా చిరత అటాక్ చేసింది. ఆవు దూడ మృతి చెందడతంతో రైతులు, పశువుల కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా వన్యప్రాణుల సంచారం పెరిగిందని, ఇప్పుడు నేరుగా గ్రామ శివారుల్లోనే చిరుత దాడికి పాల్పడటంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. చీకటి పడితే ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థులు ఒంటరిగా పొలాలకు వెళ్దొద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చిరుతను వీలైనంత త్వరగా బంధించాలని ప్రజలు కోరుతున్నారు.

