సిమ్లా, జూన్ 30: హిమాచల్ప్రదేశ్లో లాహౌల్- స్పితి జిల్లాలోని ఝల్మా వాగులో నీటి ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో మారుమూల ప్రాంతాలను కలిపే రహదారిలోని కొంత భాగం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
దీంతో ఆ రహదారి మార్గంలో రాక పోకలు నిలిచిపోయాయి. ఆ జాబితాలో పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనాలు కూడా భారీగా ఉన్నాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 50కి పైగా పర్యాటకుల వాహనాలు చిక్కుకుపోయాయని జిల్లా ఎస్పీ శివానీ మెహ్లా వెల్లడించారు.
దెబ్బతిన్న రహదారి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), స్థానిక యంత్రాంగంతో కలిసి అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మరికొన్ని గంటల్లో ఆ పనులు పూర్తవుతాయని చెప్పారు. రహదారి పునరుద్ధరణ పనులు పూర్తయిన వెంటనే.. పర్యాటకులు ఈ ప్రాంతం నుంచి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ప్రాంతంలో వర్షాలు లేవని అన్నారు. అయితే హిమానీనదం కరగడం వల్ల అకస్మాత్తుగా వాగులో నీరు పెరిగిందని ఉన్నతాధికారులు వివరించారు.
ఏఐ చేతులెత్తేస్తే.. మనుషులే దిక్కయ్యారు!
For More National News And Telugu News

