అమరావతి, జూన్7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ మద్దతుదారులు, జనసైనికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీని బలోపేతం చేశామని, అయితే కొందరు నాయకుల ప్రవర్తన ఆ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, క్రమశిక్షణరాహిత్యం కారణంగా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా, నగర, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో పాటు కమిటీల్లోని ఇతర సభ్యులను కూడా తమ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సక్రమంగా నడవదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ వివరించారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇదే కారణాలతో రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త కమిటీ నియామకం జరిగే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను జనసేన కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
.
గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News

