తుని, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు.
అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తమ ప్రభుత్వ కల అని ఉద్ఘాటించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సీఎం ఈరోజు (సోమవారం) పర్యటించారు. తుని నియోజకవర్గం, చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దుచేశారని తెలిపారు.
ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని వ్యాఖ్యానించారు. రైతుల ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను, పవన్ కల్యాణ్ కలిశామని ప్రస్తావించారు. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లామని.. మూడు పార్టీలు కలిసింది ఈ జూన్లోనే అని చెప్పారు.
జూన్ నెలకో ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తుని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని తెలిపారు. దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. కత్తులు, కటారాలు తీసుకొచ్చినా ఫర్వాలేదు.. ఇక్కడ తాను ఉన్నానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. నంద్యాలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైసీపీ నేతలే ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
.
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!
యువ క్రీడాకారులకు స్ఫూర్తి సాత్విక్-చిరాగ్: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News

