ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ వెళ్లారు. శనివారం సాయంత్రం సీషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు.. భారతీయ సంప్రదాయ నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టులోని జనం మోదీ, మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీషెల్స్ ఎయిర్పోర్టులో తనకు లభించిన ఘన స్వాగతంపై ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. 'అద్భుతమైన సాంస్కృతిక అనుబంధం. సీషెల్స్ ఎయిర్పోర్టులో లభించిన స్వాగతంలో కచ్ డ్యాన్స్ కూడా భాగమైంది. మన ప్రవాస భారతీయులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను కాపాడుకుంటున్న తీరు నిజంగా అభినందనీయం' అని పేర్కొన్నారు. ఇక, పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన పలు ఒప్పందాలపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. అనంతరం బొటానికల్ గార్డెన్కు వెళ్లారు. 194 ఏళ్ల తాబేలును వీక్షించారు. ఆ తర్వాత ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు.

