అమరావతి, జులై 29: రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల(RSK) పీపీపీ విధానాన్ని తీసుకువస్తూ జీ.ఓ.ఎం.ఎస్ నం.396 జారీని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణను మూడు వారాల పాటు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
ఈ పిల్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం విచారించింది. అనంతరం దీనిని వాయిదా వేసింది. పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పగించడం చట్టవిరుద్ధమని ఈ పిటిషన్లో పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే అధికారం ప్రభుత్వానికి లేదని వారు స్పష్టం చేశారు. శాసనసభలో చట్ట సవరణలు లేకుండా జీఓ ద్వారా ఈ విధానాన్ని అమలు చేయడం చట్ట విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంతో వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి దెబ్బతింటుందని సదరు పిల్లో పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో డాక్యుమెంట్పై రూ.2 వేల వరకు ఫెసిలిటేషన్ ఛార్జీ ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేదన చెందారు.
రిజిస్ట్రేషన్ సేవలను బలోపేతం చేయాలే తప్ప ప్రైవేటీకరణ అవసరం లేదని పిల్లో సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేట్ జోక్యంతో అవినీతి, అక్రమాలు పెరిగే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఆస్తుల వివరాలు, వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ డేటా భద్రతపై ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ అమలును నిలిపివేసి, ప్రభుత్వ అధికారుల ద్వారానే రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర న్యాయస్థానంలో ఈ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని పిటిషనర్ పాముల బలరాం దాఖలు చేశారు. ఆయన తరఫున అడ్వకేట్ నర్రా శ్రీనివాస్రావు న్యాయవాదిగా వ్యవహరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వ్యవస్థల్ని నాశనం చేయడమే గొడ్డలి పార్టీ అధినేత లక్ష్యం: సీఎం చంద్రబాబు
చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్
For More AP News And Telugu News

