న్యూఢిల్లీ, మే 30: ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) పోర్టల్పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్స్ పేమెంట్ సిస్టమ్ హ్యాక్కు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
50 మంది విద్యార్థులు అనధికారిక యాక్సెస్ పొందినట్లు తెలిపాయి. సైబర్ దాడి నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పేమెంట్ సిస్టమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరింత సురక్షితంగా సేవలందించేందుకు జూన్ 1వ తేదీ నుంచి పేమెంట్ సిస్టమ్ను తిరిగి ప్రారంభించనుంది.
పీటీఐ తెలిపిన వివరాల మేరకు.. రీవాల్యుయేషన్ పోర్టల్స్ పేమెంట్ సిస్టమ్పై సైబర్ దాడులు జరిగాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన పేమెంట్ గేట్వేలోకి 50 మందికి పైగా విద్యార్థులు చొరబడ్డారు. లోపలికి ప్రవేశించిన ఆ విద్యార్థులు పేమెంట్ సిస్టమ్ను మానిప్యులేట్ చేసి, ఫీజుల ధరలను మార్చేశారు. వారు చేసిన పని కారణంగా స్క్రీన్పై ఫీజు ధరలు తారుమారై కనిపించాయి.
ఫీజులు ఒక రూపాయి నుంచి 68,000 వేల రూపాయల వరకు చూపించడం అధికారులు గుర్తించారు. రీవాల్యుయేషన్ పోర్టల్ లైవ్లోకి వచ్చిన వెంటనే పేమెంట్ గేట్వేలో లోపాన్ని గుర్తించిన ఆ 50 మంది విద్యార్థులు అందులోకి వెళ్లగలిగినట్లు ప్రభుత్వ వర్గాలు పీటీఐకి తెలిపాయి. లోపాన్ని వాడుకుని ఫీజులను తమకు నచ్చినట్లుగా మార్చుకున్నారని వెల్లడించాయి. సరదా కోసమో లేదా నష్టం కలిగించాలన్న ఉద్దేశ్యంతో విద్యార్థులు ఆ పని చేసి ఉండొచ్చని పీటీఐకి తెలిపాయి.

