ఇంటర్నెట్ డెస్క్: బస్సులు, రైళ్లల్లో ప్రయాణించే కొందరు చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ విసిరేసిన ఘటనలు గతంలో ఎన్నో వైరల్ అయ్యాయి. అయితే, విమానంలో కూడా తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రీతూ జూన్ అనే మహిళ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. విమానంలో కొందరు ప్రయాణికులు తమ సీట్లపైనే టిష్యూలు పేపర్లు, ప్లాస్టిక్ కవర్లను వదిలివెళ్లారని చెప్పారు. ప్యాసింజర్లు చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఓ కవర్లో జాగ్రత్తగా పెట్టాలని విమాన సిబ్బంది సూచించారని కూడా ఆమె పేర్కొన్నారు. అయినా ప్యాసింజర్లు పౌర స్పృహ లేకుండా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. విమానంలో కూడా జనాలు ఇలా చేయడం కాస్తంత కోపం తెప్పించిందని కూడా కామెంట్ చేశారు.
ఇక ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలాంటి వాళ్లను కేవలం రైళ్లు, బస్సుల్లో చూస్తామనుకుంటే పొరపాటు అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్లక్ష్యం మెజారిటీ జనాల్లో ఉందని చెప్పారు. ప్రజలు తమ బాధ్యతను మర్చిపోకూడదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతోంది.

