అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కొత్త సర్వజన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో జరిగిన షాకింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఓ రోగికి శస్త్రచికిత్స అనంతరం తొలగించిన కాలి భాగాన్ని కుక్క నోట కరుచుకుని ఆస్పత్రి బయట తిరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగుల భద్రత, పరిశుభ్రత విషయంలో ఇలాంటి ఘటన జరగడం వైద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని, బాధ్యులపై తక్షణ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటేషన్, సెక్యూరిటీ, పర్యవేక్షణ అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికారెడ్డిని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక పంపాలని కూడా కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో కుక్కల సంచారం లేకుండా చూడాలని, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.
.
వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News

