Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా? అనే అంశంపై తాను కామెంట్ చేయలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బండి భగీరథ్ ఎపిసోడ్పై స్పందించిన కేంద్రమంత్రి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని, ఇకి ఇష్యూ ఏముంటుందని ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈకేసు విచారణ ఏదైనా ఉంటే పూర్తిగా తెలంగాణ పోలీసుల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. భగీరథ్ పోక్సో కేసు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడించారు.
పార్టీకి సంబంధం లేదు..
అది అరెస్టా? అప్పగింతనా రిపోర్టర్లు ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ఎవ్వరు పొరపాటు చేసిన తప్పు తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. భగీరథ ఇష్యూలో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బండి భగీరథ విషయంలో పోలీసులు విచారణ చేస్తారన్నారు. ఇదిలా ఉండగా రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, రైతుల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. రైతులకు అరకొర రుణమాఫీ చేశారని, దీంతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలిపోయారన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం అండగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందని నిలదీశారు. కనీస మద్దతు ధరను కేంద్రం పెంచినా.. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.
ప్రభుత్వం పచ్చి అబద్ధాలు..
అదేంటని ప్రశ్నిస్తే సీఎం, మంత్రులు ఎదురుదాడిపై దృష్టి పెడుతున్నారు తప్ప.. ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పట్లేదని విమర్శించారు. రూ.500 బోనస్ ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని, సన్నవడ్లకు కూడా బోనస్ పూర్తిగా ఇవ్వడం లేదన్నారు. అనేక విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడుతోందన్నారు. వాళ్ల చేతకాని తనాన్ని, వారి వైఫల్యాన్ని ఇతరులపై రుద్దుతున్నారని, తమకు తాము హీరోలమని చెప్పుకుంటున్నారని చురకలంటించారు. గత బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై అభాండాలు వేస్తోందని కేంద్ర మంత్రి విమర్శించారు. మంత్రులు హైదరాబాద్ లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం కాదని, జిల్లాల్లో వెళ్లి ఎందుకు కొనుగోలు చేయట్లేదని కనుక్కోవాలని కిషన్ రెడ్డి సూచించారు. బస్తా యూరియా మీద కేంద్రం రూ.2500 ఖర్చు పెడితే.. రైతుకు రూ.250కే అందజేస్తున్న ఘనత మోడీ సర్కార్ దేనని ఆయన కొనియాడారు.
Also read: బండి సంజయ్ కొంపముంచిన సొంత ముఠా.. భగీరథ కేసులో అసలు గుట్టు ఇదే!
బూత్ లెవెల్ ఆఫీసర్..
బీఆర్రెస్.. ఫసల్ బీమా అమలుపై నిర్లక్ష్యం వహించిందని, తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని కాంగ్రెస్ కూడా చెప్పిందని, కానీ ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభంపై ఇటీవల షెడ్యూల్ వచ్చిందని, అయితే ఎస్ఐఆర్ పై కొన్ని పార్టీలు నీచ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక్కరికి ఒక్క ఓటు ఒక్క దగ్గర మాత్రమే ఉండాలని, ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా ఒకరికి ఓటు 10 ప్రాంతాల్లో ఉందన్నారు. తాను రాహుల్ గాంధీని తప్పుపట్టడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ ఓటర్ లిస్ట్ సరిదిద్దడంలో అందరి బాధ్యత ఉండాలన్నారు. ఒక్కో బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక్క ఇంటికి మూడుసార్లు వెళ్తారన్నారు. ఇకపోతే.. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కిషన్ రెడ్డి చురకలంటించారు.
ఎలక్షన్ కమిషన్ పై బురద..
ముస్లింల మీటింగ్ కు వెళ్లి.. ఎస్ఐఆర్ ను అడ్డుకునేందుకు అంతా కలిసిరావాలని సీఎంగా ఉండి రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్ఐఆర్ చేసేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, బీజేపీ కార్యకర్తలు కాదని ఆయన స్పష్టంచేశారు. ఎస్ఐఆర్ ద్వారా కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ విమర్శిస్తోందని, ఇందులో ఎక్కడ కుట్ర జరుగుతుందో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఫైరయ్యారు. కేరళ, తమిళనాడులో బీజేపీ గెలవలేదని, అందుకే అక్కడ ఎస్ఐఆర్ బాగా జరిగిందని వారు మాట్లాడుతారని ఎద్దేవాచేశారు. అదే వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలిచింది కాబట్టి అక్కడ ఎస్ఐఆర్ లో తప్పు జరిగిందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి అనుమానముంటే బూత్ లకు వెళ్లి పరిశీలించాలి తప్పితే.. ఎలక్షన్ కమిషన్ పై బురద చల్లొద్దని కిషన్ రెడ్డి సూచించారు.
ఎక్కడా లేని ట్యాక్స్..
ఎస్ఐఆర్ ప్రక్రియ ఇదే తొలిసారి కాదని, కాంగ్రెస్ హయంలో కూడా జరిగిందన్నారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉంటే.., ఒక్కొక్కరిని వెతికి తొలగించాలని ఉద్యోగులకు కిషన్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. విదేశీయులను తొలగిస్తే రాహుల్ గాంధీకి నొప్పేంటని ఆయన ఘాటుగా స్పందించారు. వెస్ట్ బెంగాల్ లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉందని, కేంద్ర సిబ్బంది కాదని ఆయన స్పష్టంచేశారు. కేటీఆర్ రెండుసార్లు గెలిచి మంత్రి అయితే అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ మంచిదని, లేదంటే కాదన్నట్లా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నును.. పార్టీలతో సంబంధం లేకుండా.. అనేక ప్రభుత్వాలు తగ్గిస్తే.. తెలంగాణలో మాత్రం తగ్గించలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని ట్యాక్స్ తెలంగాణలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు తగ్గించలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు తేడా ఏముందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్ లో అమిత్ షా విమానం దిగుతుంటే.. రాష్ట్ర పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, రాష్ట్ర పోలీసులపై కేంద్ర పోలీసుల పెత్తనం ఉండదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు అన్ని అధికారాలు ఉంటాయన్నారు.
Also read: గుడ్ న్యూస్.. తెలంగాణ పథకానికి దేశ వ్యాప్త గుర్తింపు..?

