Auto driver defeats Jayakumar: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. చెన్నైలోని అత్యంత కీలకమైన రాయపురం నియోజకవర్గంలో ఒక సామాన్య ఆటో డ్రైవర్ రాజకీయ ఉద్ధండులను ఓడించి సంచలనం సృష్టించారు.
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆటో డ్రైవర్ విజయ్ ధాము.. ఏకంగా 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. నిన్నటి వరకు రోడ్లపై ఆటో నడుపుతూ సామాన్యుల కష్టాలను దగ్గరగా చూసిన ఒక వ్యక్తి.. నేడు నేరుగా శాసనసభలో అడుగుపెడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రాయపురం అంటేనే రాజకీయ ఉద్ధండులకు నిలయం. ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్కు ఈసారి చుక్కెదురైంది. అటు అధికార డీఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్ కూడా ఈ సామాన్యుడి ధాటికి నిలవలేకపోయారు. కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచే విజయ్ ధాము తన ఆధిక్యాన్ని కొనసాగించారు. తుది ఫలితాలు వచ్చేసరికి ఆయనకు 59,091 ఓట్లు లభించాయి. డబ్బు.. అధికారం.. ఉన్న నేతలను కాదని.. తమ కష్టసుఖాల్లో తోడుగా ఉండే ఒక సామాన్యుడిని ప్రజలు ఎన్నుకోవడం గమనార్హం.
విజయ్ ధాము గెలుపు తమిళ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. పాత తరం రాజకీయ నాయకులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఈ తీర్పు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. తన గెలుపు తర్వాత ధాము మాట్లాడుతూ.. సామాన్యుల గొంతుకగా అసెంబ్లీలో వినిపిస్తానని.. తన నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరాడంబరంగా జీవించే ఒక సామాన్యుడు.. రాజకీయాల్లో పెను మార్పు తీసుకురావచ్చని ఈ ఫలితం నిరూపించింది.
విజయ్ తన వ్యక్తిగత కారు డ్రైవర్ కుమారుడైన శబరినాథన్ ఆర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ శబరినాథన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. విరుగంబాక్కం బరిలో ఉన్న అధికార డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై శబరినాథన్ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కంటే 20,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. డీఎంకే కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో ఒక యువకుడి ప్రభంజనం చూసి రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

