Property Dispute: స్వేచ్ఛ బ్యూరో: ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లి కుమార్తెను దారుణంగా హత్య చేయటం నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో కలకలం రేగింది.
సమీప బంధువులకు, హత్యకు గురైన వారికి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్న నేపథ్యంలో.. ఈ హత్య వెనక బంధువులే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సుమలతకు భర్త చనిపోవడం.. లావణ్య కు పెళ్లి కాకపోవటం.. ఇటీవల సంక్రమించిన ఆస్తిని దక్కించుకునేందుకు బంధువులే పక్కా ప్లానింగ్తో ఆస్తిని రాబట్టుకునేందుకు తల్లి కుమార్తెను హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లావణ్య పేర భూమి రిజిస్ట్రేషన్..
బతాయిలను తెంపేదుకు తమ తోటకు వెళ్లిన తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇబ్రహీంపేట గ్రామంలో రుద్రాక్షి సుమలత (40) కుమార్తె లావణ్య(20) తో కలిసి నివాసం ఉంటుంది. కాగా సుమలత భర్త సుమారు 15 ఏళ్ల క్రితమే మృతి చెందారు. అయితే సుమలత కుటుంబానికి వారసత్వంగా సుమారు ఎనిమిది ఎకరాల భూమి వచ్చింది. కొంతకాలం సమీప బంధువులతో భూ వివాదాల అనంతరం ఇటీవల సుమలత కుటుంబానికి ఆ భూమి చట్టప్రకారం వచ్చింది. ఈ క్రమంలో లావణ్య పేరిట భూమి రిజిస్ట్రేషన్ అయింది.
ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అయితే మీ బ్యాగ్లో ఈ లాంగ్ బ్యాటరీ స్పీకర్ ఉండాల్సిందే!
తల్లీ కూతురు దారుణ హత్య..
ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం తమ బత్తాయి తోటలో బత్తాయాలను తెంపేందుకు చేరుకున్న తల్లి కూతుర్ల కళ్లలో కారం చల్లి, చున్నీతో మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో మిర్యాలగూడ డీఎస్పీ రాజ శేఖర రాజు, నాగార్జున సాగర్ సీఐ తేజావత్ శ్రీను నాయక్, అనుముల ఎస్ఐ సాయితో కలిసి ఘటన స్థలం వద్దకు చేరుకొని వివరాలను సేకరించారు. ఇదే విషయమై డిఎస్పి మీడియా మాట్లాడారు. డాగ్ స్క్వాడ్ బృందంతో పాటు తాము వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. భూతగాదాల నేపథ్యంలోనే దుండగులు తల్లి కూతురుని హత్య చేసినట్లు చెప్పారు. భూ వివాదం ఎప్పుడు మొదలైంది, హత్య వెనక కీలక సూత్రధారులు ఎవరు, ఇతర అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జునసాగర్ సిఐ శీను నాయక్ తెలిపారు.

