Grain Procurement: స్వేచ్ఛ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామ శివారులో శనివారం పిడుగుపాటుకు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే హైదరాబాదు నుండి వచ్చి బాధిత గొర్రెల కాపరిని పరామర్శించారు.
నిరంతరం పర్యవేక్షన..
ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని హామీ ఇస్తూ, తక్షణ సహాయం కింద రూ.50 వేల నగదును అందజేశారు. అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాశులను ఆయన పరిశీలించారు. వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, జిల్లా అధికారుల పర్యవేక్షణలో తడిసిన ధాన్యాన్ని సైతం గోదాములకు తరలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.
Also read: మానవత్వమే పరమార్థంగా మంచు మనోజ్ ముందడుగు.. 'ఐక్య ధైర్య సేన సమితి' ప్రారంభం
మద్దతు ధర..
ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి ఊహించిన దానికంటే భారీగా పెరగడంతో గోదాములు సరిపోవడం లేదని చెప్పారు. ఈ సమస్యను అధిగమించడానికి కాటన్ గోదాములు, ప్రైవేట్ గోదాములతో పాటు అవసరమైన చోట ఫంక్షన్ హాళ్లను సైతం వినియోగించుకుని నిల్వ చేస్తున్నామని వివరించారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయడం లేదని మంత్రి జూపల్లి విమర్శించారు. దీనివల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తోందన్నారు.
హమాలీల కొరత..
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు చాలా తక్కువ ధర ఉన్నప్పటికీ, రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. హమాలీల కొరత, ఆర్థిక ఇబ్బందులు, గోదాముల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నప్పటికీ.. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

