Crop Burning: స్వేచ్చ బ్యూరో: వ్యవసాయ భూముల్లో పంట కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చివేయడం వల్ల భూసారం, పర్యావరణం మరియు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు డా.
బి. గోపి తెలిపారు. తాత్కాలిక సౌలభ్యం కోసం పంట వ్యర్థాలను తగులబెట్టడం రైతులకు దీర్ఘకాలంలో ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
నేల జీవసత్తువ..
పంట అవశేషాలను తగులబెట్టడంతో భూసారంపై ప్రభావం పడుతుందని, నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు సూక్ష్మ పోషకాలు నశించి భూమి నిస్సారంగా మారుతుందన్నారు. భూమికి మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశించడం వల్ల నేల జీవసత్తువ కోల్పోయి, పంట దిగుబడులు క్రమంగా తగ్గిపోతాయని వివరించారు. అంతేగాకుండా పంట వ్యర్థాల దహనం వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు గాలి కాలుష్యాన్ని పెంచి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయన్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు , వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. రోడ్లపై పొగమంచు ఏర్పడి దృశ్యమానత తగ్గడంతో ప్రమాదాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు.
IND vs PAK: భారత్-పాక్ మహాపోరుకు ముహూర్తం ఫిక్స్..ఎప్పుడు, ఎక్కడంటే ?
సేంద్రియ ఎరువుగా..
రోటావేటర్, శ్రెడర్ వంటి యంత్రాలతో పంట అవశేషాలను భూమిలోనే కలియదున్నాలన్నారు. పంట వ్యర్థాలపై యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా డీకంపోజర్ను వినియోగించడం ద్వారా వాటిని త్వరగా సేంద్రియ ఎరువుగా మార్చవచ్చు అని, దీనివల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందన్నారు. పంట వ్యర్థాలను కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ తయారీకి, పశుగ్రాసంగా, మల్చింగ్ కోసం వినియోగించి అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి మంగళవారం నిర్వహించే "రైతు నేస్తం" కార్యక్రమాల్లో పంట అవశేషాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
రైతుల జాగ్రత్తలు
అలాగే, పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా రోటావేటర్తో కలియదున్నడం, వేస్ట్ డీకంపోజర్ వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని రైతులను కోరారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, తెలంగాణ ప్రభుత్వం జీవో 27ను 2017 జూలై 10న అవశేషాలను బహిరంగంగా కాల్చకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణాన్ని, భూసారాన్ని కాపాడే ఉద్దేశంతో ఇటువంటి ఘటనలపై రూ.5,000 వరకు పర్యావరణ పరిహారం విధించే నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు. రైతులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయం దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు."పంట వ్యర్థాలు - భూమికి బలం" అనే నినాదంతో రైతులు ముందుకు సాగాలని సూచించారు.

