Solar Expansion: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 లక్ష్యాలకు అనుగుణంగా, విద్యుత్ డిమాండ్ కేంద్రాలకు సమీపంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సరికొత్త పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది.
ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 18(33/11 కేవీ) విద్యుత్ సబ్స్టేషన్లలో మొత్తం 19 మెగావాట్ల సామర్థ్యం గల నేలపై అమర్చే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి అయ్యే రూ.66.50 కోట్ల అంచనా వ్యయాన్ని ఆయా డిస్కమ్లు భరిస్తాయని పేర్కొన్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 8 సబ్స్టేషన్లలో 8 మెగావాట్ల ప్లాంట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 10 సబ్స్టేషన్లలో 11 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా, తాళమడుగు మండలం, కజ్జర్ల సబ్స్టేషన్ పరిధిలోని సర్వే నంబర్ 142లో గల 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాంట్ ఏర్పాటు కోసం ఎన్పీడీసీఎల్ సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వాహనదారులకు మళ్లీ షాక్.. రెండోసారి పెరిగిన సీఎన్జీ ధరలు, లబోదిబో మంటున్న ఆటోలు, క్యాబ్లు
2029-30 ఆర్థిక సంవత్సరం
ఈ ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీజీ రెడ్కో) నోడల్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన ఈపీసీ కాంట్రాక్టర్లను పారదర్శకమైన పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నారు. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో 20,000 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని, అలాగే 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఇంధన శాఖ పేర్కొంది.

