Telangana Activists: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతమయ్యాయి. ఈ మేరకు ఇటీవల సర్కార్ నియమించిన తెలంగాణ ఉద్యమ కారుల కమిటీ ఫస్ట్ మీటింగ్ ఆదివారం జరిగింది.
చైర్మన్ కేశవరావు, కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ఫ్రొ కోదండరాం, అద్దంకి దయాకర్,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి లు ప్రత్యేక మీటింగ్ ను నిర్వహించారు. ఉద్యమకారులను గుర్తించడానికి నాలుగు రకాల ప్రతిపాదనలను కమిటీ సిద్ధం చేసింది. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారిని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించారు.
తెలంగాణ ఉద్యమ కేసులు..
ఇక ఉద్యమంలో గాయపడిన వారికి రెండవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదించారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు ,అరెస్టులు అయిన వారు, తెలంగాణ ఉద్యమ కేసులు అయిన వారు మూడవ కేటగిరి గా తీసుకోనున్నారు. అంతేగాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని నాలుగవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదించారు. నాలుగవ కేటగిరి గుర్తించడానికి వారు ఉద్యమంలో చేసిన పేపర్ కటింగ్స్ చూడాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.
Also read: గద్వాల్లో జోరుగా క్రికేట్ బెట్టింగ్ దందా.. 100 నుండి లక్ష వరకు పందెం కాస్తున్న రాయుళ్లు!
త్వరలో ఆల్ పార్టీ సమావేశం
తర్వాత అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ నిర్ణయం తీసుకున్నది. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోనున్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,1969 ఉద్యమకారులు , ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ , కుల సంఘాల ,న్యాయవాదులు జేఏసీ,వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు వారి నుండి ప్రతిపాదనలు సేకరించనున్నారు.ఈ ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విసృతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించింది.
ఉద్యమకారుల ఎంపిక..
తెలంగాణ ఉద్యమంలో పౌరసమాజం లో ఉండి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారి నుండి ప్రతిపాదనలు తీసుకుంటారు. 1969,1972,1996 ఉద్యమకారులతో సమావేశమై ప్రతిపాదనలు తీసుకుంటారు. ఉద్యమస్థిత్వాన్ని కాపాడేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసిందని రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక జరుగుతుందని సభ్యులు తెలిపారు. గత ప్రభుత్వంలో కొంత మందికి మాత్రమే సహాయం అందించారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమకారుల కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనూ కమిటీ చర్చించనున్నది.
Also read: గుడ్ న్యూస్.. తెలంగాణ పథకానికి దేశ వ్యాప్త గుర్తింపు..?

