టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్ను (PVCU) హాలీవుడ్ రేంజ్లో విస్తరిస్తున్నారు. ప్రస్తుతం అందరి కళ్లు ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'జై హనుమాన్'పైనే ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు.
ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ అప్డేట్కు సంబంధించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) నటనకు ఫిదా అయిన ప్రశాంత్ వర్మ, ఆయనను 'జై హనుమాన్' (Jai Hanuman) ప్రాజెక్టులోకి కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ వర్మ యూనివర్స్లోని 'మహాకాళి' చిత్రంలో అక్షయ్ ఖన్నా 'శుక్రాచార్యుడి' (Shukracharya)గా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
అక్షయ్ ఖన్నా పోషించబోయే పాత్రపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 'మహాకాళి'లో ఆయన చేస్తున్న శుక్రాచార్యుడి పాత్రకు, 'జై హనుమాన్'లోని పాత్రకు ఏమైనా లింక్ ఉంటుందా? లేక ఇది సరికొత్త పాత్రనా? అన్నది మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రశాంత్ వర్మ తన యూనివర్స్లోని పాత్రలను ఒకదానితో ఒకటి అనుసంధానించడంలో దిట్ట కాబట్టి, అక్షయ్ ఖన్నా ఎంట్రీ ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తోంది. కేవలం బాలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే కాకుండా, పాత్రకు ఉన్న వెయిటేజ్ కారణంగానే ఆయనను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక 'జై హనుమాన్'లో కన్నడ స్టార్, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ (హనుమంతుడుగా) చేస్తున్న విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి లాంటి పవర్ఫుల్ పర్ఫార్మర్కు తోడు అక్షయ్ ఖన్నా వంటి వెర్సటైల్ యాక్టర్ తోడవ్వడం సినిమాకు పెద్ద అసెట్ కానుంది. ప్రశాంత్ వర్మ విజన్ ప్రకారం, ఈ యూనివర్స్లో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది, కాబట్టి అక్షయ్ ఖన్నా రోల్ కూడా కథను మలుపు తిప్పేలా ఉంటుందని టాక్. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ను పాన్-ఇండియా లెవల్లో స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమనిపిస్తోంది. 'జై హనుమాన్'లో అక్షయ్ ఖన్నా రోల్కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

