కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సినీ రంగంలో మారుతున్న పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొత్త థియేటర్లు ఏర్పాటు లేకపోగా..
ఉన్న థియేటర్లు ఒక్కొక్కటిగా మూతబడుతూ వస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు మూతపడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఒకప్పుడు మొత్తం 14 సింగిల్ స్ర్కీన్ థియేటర్లు ఉండేవి. అందులో, ఇప్పటికే 8 థియేటర్లు మూతపడ్డాయి. తాజాగా ఇప్పుడు రాఘవ థియేటర్ (Raghava Theater) మూతపడింది. చిత్తూరు నగరంలో రాఘవ థియేటర్కు ఓ ప్రత్యేకత ఉంది. చిత్తూరు (Chittoor) నగరంలోని మిట్టూరు ప్రాంతంలో రాఘవ థియేటర్ ఏర్పాటైంది. బంగారుపాలెం మండలం, నలగాంపల్లి గ్రామంలోని ఎన్పి కుటుంబానికి చెందిన వీర రాఘవులు నాయుడు జ్ఞాపకార్థం ఆయన పేరుపై థియేటర్ను నిర్మించారు. ఆయన రాజకీయ, ఆర్థిక, సామాజిక సేవారంగాల్లో ఎన్నో పేరు ప్రఖ్యాతలు గడించారు. వీర రాఘవులు నాయుడు మరణానంతరం.. టీడీపీ ఆవిర్భావం తర్వాత చిత్తూరు నుంచి ఆయన సతీమణి ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి ఎమ్మెల్యేగానూ, ఎంపీగానూ పని చేశారు.
1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (NT Rama Rao) నటించిన 'శ్రీకృష్ణ పాండవీయం' సినిమాతో మొదలైన థియేటర్.. 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. రాఘవ థియేటర్ చిత్తూరుకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిందని చెప్పాలి. 40 ఏళ్ల పాటు వినోదాన్ని అందించిన ఈ థియేటర్ ఇప్పుడు శాశ్వతంగా మూతబడి కనుమరుగు కావడాన్ని ప్రేక్షకులే కాదు.. యాజమాన్యం సైతం జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ థియేటర్ దగ్గర పెద్ద హీరోల సినిమాల రిలీజ్ రోజున ఫ్యాన్స్ సందడి పండుగ వాతావరణాన్ని తలపించేది. ఎన్నో సినిమాలు 100, 200, 300 రోజులు ఆడి రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. 'శుభలగ్నం, పోకిరి, పెళ్లి చేసుకుందాం, సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, హలో బ్రదర్' వంటి అనేక సినిమాలు ఎక్కువ రోజులు ప్రదర్శించబడి రికార్డులు సృష్టించాయి. పాత తరం నుంచి నేటి తరం వరకు ఈ థియేటర్తో ఎందరికో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.

