Dailyhunt
Hyderabad: KBR పార్క్ చుట్టూ వన్ వే.. వాహనాల మళ్లింపు ఇలా..!

Hyderabad: KBR పార్క్ చుట్టూ వన్ వే.. వాహనాల మళ్లింపు ఇలా..!

NTV Telugu 1 week ago

Hyderabad: జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ప్రాంతాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులను ప్రయోగాత్మకంగా ‘వన్ వే’ (ఏకముఖ మార్గం)గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ అధికారులు స్పష్టత ఇచ్చారు.

ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు:

పంజాగుట్ట వైపు నుండి: పంజాగుట్ట నుంచి చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఇకపై కేబీఆర్ పార్క్, క్యాన్సర్ హాస్పిటల్, టీఆర్ఎస్ భవన్, రోడ్ నంబర్ 12, 45 , 36 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

మాదాపూర్ వైపు నుండి:మాదాపూర్ నుండి రోడ్ నంబర్ 12కు వచ్చే వాహనాలు నేరుగా రాకుండా చెక్‌పోస్ట్, క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.

రోడ్ నంబర్ 45 నుండి:ఒకవేళ రోడ్ నంబర్ 45 నుంచి అగ్రసేన్ స్టాచ్యూ వైపు వెళ్లాలంటే అక్కడ నేరుగా రైట్ టర్న్ ఉండదు. వాహనదారులు ఎడమ వైపు (Left) తీసుకొని చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, బసవతారకం మీదుగా అగ్రసేన్ విగ్రహం చేరుకోవాలి.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10: ఇక్కడి నుండి రోడ్ నంబర్ 36కు వెళ్లే వారికి నేరుగా రైట్ టర్న్ ఉండదు. వారు వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్స్ నుండి అల్కజార్ ప్లాజా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.

పైలట్ స్టడీ , ఏర్పాట్లు:
ఈ కొత్త విధానాన్ని తొలుత రెండు గంటల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ సమయంలో డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ గమనాన్ని పర్యవేక్షిస్తారు. ఎక్కడెక్కడ రోడ్ డివైడర్లు (మీడియన్లు) కట్ చేయాలి, ఎక్కడ రోడ్లు వెడల్పు చేయాలి , ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో గుర్తించి జిహెచ్‌ఎంసి సహాయంతో వాటిని తొలగిస్తారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే, శాశ్వతంగా వన్ వే నిబంధనను అమలులోకి తెస్తారు.

Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..

వాహనదారుల సౌకర్యార్థం:

వాలంటీర్ల నియామకం:ట్రాఫిక్ మళ్లింపుల వల్ల వాహనదారులు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ సుమారు 100 మంది వాలంటీర్లను నియమించి వాహనదారులకు దారి చూపేలా చర్యలు తీసుకుంటున్నారు.

అవగాహన: ప్రజలకు అర్థమయ్యేలా ఒక చిన్న వీడియోను రూపొందించి సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తామని, అలాగే ప్రతి కూడలి వద్ద స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

ఎందుకు ఈ మార్పు?
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో భవిష్యత్తులో జరగబోయే నిర్మాణ పనుల కారణంగా రోడ్డు వైశాల్యం తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ఈ వన్ వే విధానమే సరైన పరిష్కారమని పోలీసులు భావిస్తున్నారు. యూ-టర్న్ల అవసరం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేలా ఈ ప్లాన్ రూపొందించారు.

కొత్త నిబంధనల పట్ల అలవాటు పడటానికి వాహనదారులకు కొంత సమయం పట్టినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుందని పోలీసులు నమ్ముతున్నారు. ఈ పైలట్ స్టడీలో వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu