Dailyhunt
SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

NTV Telugu 3 weeks ago

పీఎల్ 2026 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది.

ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌ ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. తొలుత టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకోగా, సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి, సొంత గడ్డపై హైదరాబాద్‌కు మరో పరాజయాన్ని మిగిల్చాడు.

Price Secret: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ.. భారత్‌లో మాత్రం ధరలు ఎందుకు తక్కువ..? అసలు రహస్యం ఇదే..

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. లక్నో బౌలర్, సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు మహమ్మద్ షమీ తన పాత జట్టుపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. కేవలం 11 పరుగులకే అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7), కెప్టెన్ ఇషాన్ కిషన్ (1) వంటి కీలక వికెట్లను కోల్పోయి హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (41 బంతుల్లో 62), యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి (33 బంతుల్లో 56) అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి తన అర్ధ సెంచరీ తర్వాత 'పుష్ప' స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకోవడం స్టేడియంలోని అభిమానులను అలరించింది. అయితే, వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో స్కోరు వేగం తగ్గింది. లక్నో బౌలర్లలో షమీ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎయిడెన్ మార్క్రామ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మార్క్రామ్ 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి లక్ష్యాన్ని సులువు చేశాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే, హైదరాబాద్ బౌలర్ హర్ష్ దూబే తన స్పిన్ మాయాజాలంతో మార్క్రామ్ , ఆయుష్ బదోనిలను అవుట్ చేసి మ్యాచ్‌ను రక్తి కట్టించాడు. మధ్యలో నికోలస్ పూరన్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు తిరిగినట్లు అనిపించింది. కానీ, ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రిషబ్ పంత్ పట్టువదలకుండా క్రీజులో పాతుకుపోయాడు. 45 బంతుల్లో 56 పరుగులు చేసిన పంత్, చివర్లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఆఖరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 13 పరుగులు అవసరమైన వేళ, హర్షల్ పటేల్ 19వ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చాడు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సి ఉండగా, జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌కు వచ్చాడు. పంత్ మొదటి బంతికే ఫోర్ బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆ తర్వాత రెండో బంతిని వినూత్నమైన ‘టెన్నిస్ స్టైల్’ షాట్‌తో మరో ఫోర్‌గా మలిచి స్కోర్లను సమం చేశాడు. ఇక 19.5వ బంతికి మరో ఫోర్ కొట్టిన పంత్, 5 వికెట్ల తేడాతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ తన సొంత మైదానంలో పాయింట్లు కోల్పోగా, లక్నో టోర్నీలో తన జోరును కొనసాగిస్తోంది. బౌలింగ్‌లో హర్ష్ దూబే 4 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసినా, బ్యాటర్ల వైఫల్యం హైదరాబాద్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu