Sowjanya Anneboina August 22, 2026prabhanews.com
- శ్రావణ శనివారం పురస్కరించుకుని వందలాదిగా తరలిన భక్తులు..
- మార్మోగిన ఆంజనేయ, విఠల నామస్మరణ
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈసారి కూడా భక్తులు శ్రావణ శనివారం ఉదయం మద్నూర్ మండలంలోని మిర్జాపూర్లో ప్రసిద్ధిగాంచిన హనుమాన్ మందిరం వరకు వందలాదిగా పాదయాత్రగా బయలుదేరారు. శ్రీకిరణ్ మహారాజ్ ఆధ్వర్యంలో బస్వాపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాదయాత్ర భాజా, భజంత్రీలు, భజనలు, కీర్తనలతో ప్రారంభమైంది. ఆంజనేయ, విఠల, విఠల పాండురంగ నామస్మరణలతో గ్రామం మార్మోగింది.
గ్రామ ప్రముఖులు, గ్రామ పెద్దలు గ్రామ పొలిమేర వరకు వచ్చి భక్తులకు వీడ్కోలు పలికి పాదయాత్రను సాగనంపారు. పాదయాత్ర జుక్కల్, పెద్దఎడ్గి, సోమూర్ చౌరస్తా మీదుగా సాగగా ఆయా గ్రామాల ప్రజలు భక్తులకు ఘన స్వాగతం పలికారు. జుక్కల్ ఎస్సై మురళి సైతం పాదయాత్రలో పాల్గొని కొద్దిదూరం భక్తులతో కలిసి కాలినడకన నడిచారు. సోమూర్ చౌరస్తా వద్ద మాలిపటేల్ వీరభద్ర రచప్ప, తడ్గూర్ గ్రామంలో బస్వరాజ్ పటేల్ భక్తులకు నీరు, ఫలహారం, పండ్లు అందించారు.
హాండేకేలూర్, భక్తాపూర్ మీదుగా సాయంత్రానికి పాదయాత్ర మిర్జాపూర్లోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకోనుంది. అక్కడ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, జలాభిషేకం, పుష్పాభిషేకం, హారతి నిర్వహించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పాదయాత్రలో వందలాదిగా మహిళా భక్తులు పాల్గొన్నారు. జుక్కల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన భజన మండళ్లు పాదయాత్రలో భక్తి కార్యక్రమాలతో సేవలందించాయి.
