Sowjanya Anneboina April 30, 2026prabhanews.com
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో ఛాన్స్
- ఫీజులపై 25% భారీ రాయితీ
- మే 1 నుంచి జూలై 31 వరకు
- పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అవకాశం కల్పించింది. పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఫీజుల చెల్లింపులపై 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ మేరకు జీఓ నంబర్ 131ను విడుదల చేశారు. ఎల్ఆర్ఎస్-2020 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్లాట్ యజమానులకు ఈ వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం స్పష్టం చేసిన మేరకు,2026 మే 1 నుంచి జూలై 31 వరకు మూడు నెలల గడువులో ఫీజులు చెల్లించే వారికి మాత్రమే ఈ 25 శాతం రాయితీ వర్తిస్తుంది.
సాధారణ మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఊరటనివ్వడమే కాకుండా, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ అరుదైన అవకాశాన్ని ప్లాట్ యజమానులు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేల సంఖ్యలో ఉన్న దరఖాస్తుదారులకు గణనీయమైన ఆర్థిక లాభం చేకూరనున్నది.

