Nagamani Malligari April 30, 202615 years
గుడివాడలో పశు సంచారం నియంత్రణ..
కమిషనర్ సింహాద్రి మనోహర్ చర్యలకు ప్రశంసలు..
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా రోడ్ల పై విచ్చలవిడిగా తిరిగే పశువుల సమస్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది.
పగలు-రాత్రి తేడా లేకుండా సంచరించే పశువుల వల్ల రవాణా అంతరాయం, ప్రమాదాలు, పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసేవారు. గత 15 ఏళ్లలో అనేక మంది కమిషనర్లు మారినా ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడ పురపాలక సంఘ కమిషనర్ సింహాద్రి మనోహర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమస్య తీవ్రతను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రోడ్ల పై సంచరించే పశువులను నియంత్రించడం, యజమానులపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలతో పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచారు. ఈ చర్యల ఫలితంగా గత కొన్ని నెలలుగా గుడివాడ పట్టణ వీధులు ప్రశాంతంగా, పరిశుభ్రంగా, సుందరంగా మారాయి. ప్రజలు కూడా ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దిశానిర్దేశాలతో పట్టణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు అవుతున్నాయి.
పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మంచి ఆలోచన ఉన్న మరియు కృషి చేసే అధికారులు గుడివాడకు రావడం అదృష్టకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గుడివాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు

