Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
ఊట్కూర్, ఆంధ్రప్రభ : దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కలలుగన్న పేదల సంక్షేమం, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు, కాంగ్రెస్ నేత వాకిటి శేషగిరి అన్నారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవెల్లి గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన గృహాల్లో గృహప్రవేశాలు చేయించి, లబ్ధిదారులకు వాకిటి వారి కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా వాకిటి శేషగిరి మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేస్తున్న కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని శేషగిరి పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రెడ్డి, ఎడవెల్లి సర్పంచ్ ఆంజనేయులు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
