Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం ఉదయం సూర్యోపాసన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
లోకకల్యాణం, భక్తుల క్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అరుణ పారాయణం, మహాసౌర పారాయణంతో పాటు సూర్య అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, మానసిక ప్రశాంతత కలుగుతాయని వేద పండితులు తెలిపారు. ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారని పేర్కొన్నారు. సూర్యోపాసన అనంతరం శ్రీ కనకదుర్గమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. సూర్యోపాసన వంటి ఆర్జిత సేవల్లో పాల్గొనదలచిన భక్తులు ముందస్తుగా అధికారిక 'మనమిత్ర' వాట్సాప్ సేవల ద్వారా లేదా దేవస్థానం కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.
