Rama Rao August 4, 2026Telangana
మునుగోడు, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.
మునుగోడులో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల మండల సదస్సు వరికుప్పల ముత్యాలు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో జైల్ భరో కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలు ప్రజా వ్యతిరేకమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు సంఘాల నాయకులు సాగర్ల మల్లేష్, యాసరాని శ్రీనివాస్, మిరియాల భరత్, వడ్లమూడి హనుమయ్య, కొంక రాజయ్య, వేముల లింగస్వామి, రాములు, పావని, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
